వైసీపీ తమ పార్టీ కార్యకలాపాల కోసం దుర్గ గుడిని వాడుకోవడం దారుణం: బోండా ఉమ

  • హిందూ దేవాలయాలపై చులకనగా వ్యవహరిస్తున్నారు
  • దుర్గగుడిలో మంత్రి వెల్లంపల్లి పార్టీ మీటింగ్ పెట్టారు
  • అంతర్వేది కేసులో ఒక్క అరెస్ట్ కూడా జరగలేదు
హిందువుల మనోభావాలను గాయపరిచే విధంగా వైసీపీ వ్యవహరిస్తోందని టీడీపీ నేత బోండా ఉమ మండిపడ్డారు. విజయవాడలోని దుర్గ గుడిని వైసీపీ కార్యాలయంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. దుర్గగుడిలో వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులతో సమావేశం నిర్వహించిన దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లిని మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

హిందూ దేవాలయాల పట్ల వైసీపీ ప్రభుత్వం చులకన భావంతో వ్యవహరిస్తోందని బోండా ఉమ మండిపడ్డారు. 17 నెలల పాలనలో ఎన్నో దేవాలయాలను వైసీపీ ప్రభుత్వం ధ్వంసం చేసిందని చెప్పారు. దేవాలయాలపై అనేక దాడులు జరిగాయని... కానీ, ఇంత వరకు వాటికి బాధ్యులైన ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదని అన్నారు.

 అంతర్వేది రథాన్ని దగ్ధం చేసిన కేసును సీబీఐకి అప్పగించామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుందని... కానీ, ఈ కేసులో ఇంత వరకు ఒక్క అరెస్ట్ కూడా జరగలేదని విమర్శించారు. అసలు ఈ కేసును సీబీఐకి ఇచ్చారనే విషయంలో కూడా తమకు అనేక అనుమానాలు ఉన్నాయని చెప్పారు.

Bonda Uma
Telugudesam
Vellampalli Srinivasa Rao
YSRCP
Durga Temple

More Telugu News